రణ్‌వీర్‌ సింగ్ 'ధురంధర్‌'పై హృతిక్ కామెంట్స్.. వివాదానికి దారితీసిన వ్యాఖ్యలు

  • 'ధురంధర్' సినిమాపై ప్రశంసలు కురిపించిన హృతిక్ రోషన్
  • చిత్రంలోని రాజకీయ అంశాలను అంగీకరించనని వ్యాఖ్య
  • బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లు వసూలు చేసిన సినిమా
ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'ధురంధర్' చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూనే, అందులోని రాజకీయ అంశాలతో తాను ఏకీభవించలేనని చెప్పడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సినిమాపై హృతిక్ స్పందిస్తూ, "నాకు 'ధురంధర్' చాలా నచ్చింది. ఇంత గొప్ప కథను ప్రేక్షకులకు అందించిన చిత్ర బృందానికి నా అభినందనలు. కథను తెరకెక్కించిన విధానం, హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్దిన తీరు అద్భుతం. అయితే, ఇందులో చూపించిన రాజకీయపరమైన అంశాలను నేను అంగీకరించలేకపోతున్నా. బహుశా దర్శకులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి అలా రూపొందించారని భావిస్తున్నా. ఒక పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఈ చిత్రాన్ని ఎంతో ఆస్వాదించాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని అన్నారు.

హృతిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 'ధురంధర్' చిత్రంలో పాకిస్థాన్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని, వారి దాడుల భయానకత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని, ఆ వాస్తవాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను చూపించడాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు, రణ్‌వీర్‌ సింగ్, మాధవన్, సంజయ్‌ దత్, అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ వారంలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


More Telugu News