లాటరీ గెల్చుకున్న వ్యక్తి కుటుంబంతో పాటు అజ్ఞాతంలోకి.. ఎందుకంటే..!

  • రూ.200 పెట్టి టికెట్ కొని కోటిన్నర గెల్చుకున్న పంజాబీ
  • డబ్బుల కోసం ఎవరైనా దాడి చేస్తారేమోనని భయాందోళనలు 
  • పోలీసులు కల్పించుకుని ధైర్యం చెప్పడంతో తిరిగొచ్చిన కుటుంబం
  • పంజాబ్ లోని ఫరీద్ కోట్ జిల్లాలో ఘటన
ఒక వ్యవసాయ కూలీని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. రూ.200 పెట్టి కొన్న టికెట్ కు ఏకంగా కోటిన్నర రూపాయల బహుమతి దక్కింది. ఈ విషయం చుట్టుపక్కల బాగా ప్రచారం కావడంతో ఆ వ్యవసాయ కూలి కుటుంబం భయాందోళనలకు గురై అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇంటికి తాళం వేసి, సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లిపోయింది. 

లాటరీ డబ్బు కోసం ఎవరైనా తమపై దాడి చేసే అవకాశం ఉందనే భయంతో కుటుంబం మొత్తం ఇల్లు విడిచిపెట్టి పోయింది. పంజాబ్ లోని ఫరీద్ కోట్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, పోలీసులు కల్పించుకుని వారికి రక్షణగా ఉంటామని హామీ ఇవ్వడంతో ఆ కుటుంబం తమ ఇంటికి తిరిగివచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఫరీద్‌ కోట్ జిల్లాలోని సైదేకే గ్రామానికి చెందిన నసీబ్ కౌర్, ఆమె భర్త రామ్ సింగ్‌ లు వ్యవసాయ కూలీలు. రామ్ సింగ్ ఇటీవల కొన్న లాటరీ టికెట్ కు రూ.1.5 కోట్ల ప్రైజ్ మనీ తగిలింది. దీంతో తమ కష్టాలు తీరిపోయాయని ఆ జంట సంతోషించింది. అయితే.. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లోనూ విశేషంగా ప్రచారం కావడంతో రామ్ సింగ్ తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. డబ్బు కోసం తమపై దాడి జరగవచ్చని ఆందోళన చెందాడు. 

దీంతో ఇంటికి తాళం వేసి, సెల్ ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేసి భార్య సహా ఊరు విడిచివెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఫరీద్‌ కోట్ పోలీసులు.. రామ్ సింగ్, నసీబ్ కౌర్ లను సంప్రదించారు. ప్రజల భద్రత కోసమే తాము ఉన్నామని, వారికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రామ్ సింగ్, నసీబ్ కౌర్ తమ ఇంటికి తిరిగి వచ్చారు.


More Telugu News