ఇద్దరు స్నేహితులకు దొరికిన విలువైన వజ్రం

  • ఎంపీలోని పన్నాలో ఇద్దరు యువకులకు జాక్‌పాట్
  • లీజుకు తీసుకున్న గనిలో 15 క్యారెట్ల వజ్రం లభ్యం
  • వజ్రం విలువ రూ.50 లక్షలుగా అధికారుల అంచనా
  • సోదరీమణుల వివాహం కోసం గని తవ్వకాలు
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, తమ సోదరీమణుల వివాహాలు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్న ఇద్దరు స్నేహితుల తలరాతను ఓ వజ్రం రాత్రికి రాత్రే మార్చేసింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో వారు లీజుకు తీసుకున్న గనిలో జరిపిన తవ్వకాల్లో ఏకంగా రూ.50 లక్షల విలువైన వజ్రం లభించింది. ఈ అదృష్టం సతీశ్ ఖాతిక్ (24), సాజిద్ మొహమ్మద్ (23) అనే యువకులను వరించింది.

పన్నాలోని రాణిగంజ్‌కు చెందిన సతీశ్ మాంసం దుకాణం నడుపుతుండగా, సాజిద్ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరివీ నిరుపేద కుటుంబాలు కావడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. సుమారు 20 రోజుల క్రితం ఓ చిన్న గనిని లీజుకు తీసుకుని తవ్వకాలు ప్రారంభించారు. గతంలో సాజిద్ తండ్రి, తాత కూడా వజ్రాల కోసం ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు.

అయితే, ఈ స్నేహితుల ప్రయత్నం ఫలించింది. తవ్వకాలు చేస్తుండగా ఓ మెరిసే రాయి వారి కంటపడింది. దానిని వెంటనే స్థానిక డైమండ్ అధికారికి అప్పగించారు. అధికారులు దాన్ని పరిశీలించి, అది 15.34 క్యారెట్ల నాణ్యమైన వజ్రమని నిర్ధారించారు. మార్కెట్‌లో దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేయనున్నట్లు తెలిపారు.

వేలం ద్వారా వచ్చే డబ్బును చెరిసగం పంచుకోవాలని స్నేహితులిద్దరూ ముందే నిర్ణయించుకున్నారు. ఈ డబ్బుతో ముందుగా తమ సోదరీమణుల పెళ్లిళ్లు ఘనంగా చేస్తామని, మిగిలిన మొత్తంతో ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభిస్తామని వారు సంతోషంగా చెబుతున్నారు. 


More Telugu News