కరూర్ తొక్కిసలాట ఎఫెక్ట్.. ఈ షరతులతో హీరో విజయ్ బహిరంగ సభకు అనుమతి

  • ప్రచార రథంపై నుంచి మాట్లాడనున్న విజయ్
  • సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదని షరతు
  • పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలని షరతు
సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు పుదుచ్చేరిలో బహిరంగ సభ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇటీవల కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో కొన్ని షరతులతో ఈ సభకు అనుమతి లభించింది. రేపు ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్‌‌లో సభ జరగనుంది. పోలీసులు విధించిన షరతుల ప్రకారం విజయ్ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచార రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదని పోలీసులు షరతు విధించారు.

చిన్నారులు, గర్భిణీ మహిళలు, వృద్ధులను ఈ సభకు అనుమతించకూడదని షరతుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనల మేరకు 5 వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇవ్వాలి. పాసులు ఉన్నవారు మాత్రమే సభకు హాజరు కావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాల ప్రజలు సభకు రావొద్దని టీవీకే పార్టీ విజ్ఞప్తి చేసింది.

పార్టీ తెలిపిన వివరాల ప్రకారం విజయ్ ప్రచార రథం సోమవారం రాత్రి పుదుచ్చేరికి చేరుకుంటుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన కారులో సభాస్థలికి చేరుకుంటారు. సభకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అనుమతి ఉంది. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగం ప్రారంభిస్తారు.


More Telugu News