మరోసారి ఇబ్బందుల్లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్!

  • బెంగళూరు పబ్‌లో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్యన్ ఖాన్!
  • మహిళల మర్యాదకు భంగం కలిగించారని ఫిర్యాదు
  • కేసు నమోదు 
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బెంగళూరులోని ఓ పబ్‌లో జరిగిన కార్యక్రమంలో అసభ్యకరమైన సైగ (మధ్య వేలు చూపడం) చేశారనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది.

వివరాల్లోకి వెళితే, నవంబర్ 28న బెంగళూరులోని ఒక పబ్‌లో జరిగిన ప్రైవేట్ ఈవెంట్‌లో ఆర్యన్ ఖాన్ పాల్గొన్నాడు. ఆ సమయంలో అతడు బహిరంగంగా అసభ్యకరమైన సైగ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగినప్పుడు పబ్‌లో మహిళలు కూడా ఉన్నారని, వారి మర్యాదకు భంగం కలిగించేలా ఆర్యన్ ప్రవర్తన ఉందని పేర్కొంటూ ఒవైజ్ హుస్సేన్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆర్యన్ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.

ఈ వ్యవహారంపై పోలీసులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల ఆధారంగా సుమోటో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా, ఘటన జరిగిన పబ్ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 


More Telugu News