రాష్ట్రపతి భవన్‌లో పుతిన్ కు ఇచ్చిన విందుకు హాజరు కావడంపై శశి థరూర్ ఏమన్నారంటే..!

  • పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ విందు
  • హాజరైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
  • కొన్ని అంశాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న థరూర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం నిన్న రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ హాజరుకావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఇదే కార్యక్రమానికి లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానం అందకపోవడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.

ఈ పరిణామాలపై ఎన్డీటీవీతో మాట్లాడిన శశి థరూర్, తాను విందుకు ఎందుకు హాజరయ్యారో స్పష్టతనిచ్చారు. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా తన విధి నిర్వహణలో భాగంగానే తాను వచ్చానని తెలిపారు.

 "విదేశాలతో సంబంధాలు నెరపడం మా కమిటీ పరిధిలోని అంశం. ఆయా దేశాలతో చర్చల్లో ఏం జరుగుతుందో, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడికి వచ్చాను. అంతకుమించి ఇందులో మరేమీ లేదు" అని ఆయన వివరించారు. విందుకు తనను ఆహ్వానించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో కొన్ని విషయాల్లో విభేదించినా, మరికొన్నింటిలో ఏకీభవిస్తూ ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి" అని ఆయన అన్నారు. 

ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్న నేపథ్యంలో పార్టీ మారే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఆచితూచి స్పందించారు. "నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీని. ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడ్డాను. వేరే నిర్ణయం తీసుకోవాలంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయడమే తన ప్రధాన బాధ్యత అని థరూర్ స్పష్టం చేశారు. 


More Telugu News