పెళ్లి వాయిదా తర్వాత తొలి పోస్ట్.. స్మృతి ఎంగేజ్‌మెంట్ రింగ్ మిస్సింగ్‌పై అనుమానాలు

  • పెళ్లి వాయిదా తర్వాత ఇన్‌స్టాలో తొలిసారి పోస్ట్ పెట్టిన స్మృతి మంధాన
  • చేతికి ఎంగేజ్‌మెంట్ ఉంగరం లేకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ
  • వివాహానికి సంబంధించిన పోస్టులను తొలగించిన భారత క్రికెటర్
  • ఆరోగ్య సమస్యల వల్లే పెళ్లి వాయిదా పడిందని కుటుంబ సభ్యుల వివరణ
  • త్వరలోనే పెళ్లి జరుగుతుందని పలాశ్ తల్లి ఆశాభావం
సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ తో వివాహం వాయిదా పడిన తర్వాత, భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి వాయిదా పడ్డాక స్మృతి తొలిసారిగా ఓ టూత్‌పేస్ట్ బ్రాండ్‌కు సంబంధించిన యాడ్ పోస్ట్ చేశారు. అయితే, ఇందులో ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ ఉంగరం లేకపోవడాన్ని గమనించిన అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. పెళ్లి రోజున స్మృతి తండ్రి శ్రీనివాస్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరగా, మరుసటి రోజు పలాశ్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఇద్దరూ కోలుకున్నారు. అయితే, స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లికి సంబంధించిన పోస్టులన్నింటినీ తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

ఈ ప్రచారంపై పలాశ్ కుటుంబ సభ్యులు స్పందించారు. కేవలం ఆరోగ్య సమస్యల వల్లే పెళ్లి వాయిదా పడిందని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. పలాశ్ తల్లి అమితా ముచ్చల్ మాట్లాడుతూ, "స్మృతి, పలాశ్ ఇద్దరూ చాలా బాధలో ఉన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. త‌ప్ప‌కుండా పెళ్లి జరుగుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

పలాశ్ సోదరి పాలక్ ముచ్చల్ కూడా మాట్లాడుతూ.. తమ కుటుంబాలు కష్టకాలంలో ఉన్నాయని, ఈ సమయంలో అందరూ సానుకూలంగా ఉండాలని కోరారు. అయితే, ఆ యాడ్ షూటింగ్ ఎంగేజ్‌మెంట్‌కు ముందే జరిగి ఉండవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News