రాజుగారికి ఒక న్యాయం, రెడ్డిగారికి మరో న్యాయమా?: యాంకర్ శ్యామల

  • ఆలయాల్లో దొంగతనాలపై ప్రభుత్వానిది పక్షపాత వైఖరి అని శ్యామల ఆరోపణ
  • సింహాచలం హుండీ దొంగతనంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అని ప్రశ్న
  • తిరుమల కొండలపై బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై పవన్ స్పందించాలని డిమాండ్
ఆలయాలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. "రాజు గారికి ఒక న్యాయం, రెడ్డి గారికి మరొక న్యాయమా?" అంటూ ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తిరుమల, సింహాచలం దేవస్థానాల్లో జరిగిన దొంగతనాల విషయంలో ప్రభుత్వం రెండు రకాలుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో రూ.72 వేల విలువైన డాలర్లు దొంగతనం జరిగితే, నిందితుడి నుంచి న్యాయమూర్తుల సలహా మేరకు రూ.14 కోట్ల విలువైన ఆస్తిని టీటీడీ పేరిట రాయించారని శ్యామల పేర్కొన్నారు. కానీ గత టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అదే సమయంలో, సింహాచలం దేవస్థానం హుండీలో రూ.55 వేలు దొంగతనం జరిగితే దేవస్థానం చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజును అందలం ఎక్కిస్తున్నారని విమర్శించారు. ఆ దొంగతనం చేసిన వ్యక్తి నుంచి ఏమైనా రికవరీ చేశారా..? దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు.

ఇదే క్రమంలో బీఆర్ నాయుడు (టీటీడీ చైర్మన్) తిరుమల ఏడు కొండలు కాదని, ఎనిమిది కొండలని అంటున్నారు... ఎనిమిదోది "చెత్త కొండ" అని వ్యాఖ్యానించారని శ్యామల ఆరోపించారు. దీనిపై పిఠాపురం పీఠాధిపతి పీపీపీ స్పందన ఏమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లను ట్యాగ్ చేశారు. 


More Telugu News