రాంగోపాల్ వర్మ హీరోగా 'షో మ్యాన్'... విలన్ గా సుమన్

  • షో మ్యాన్' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఆర్జీవీ
  • ప్రతినాయకుడి పాత్రలో సీనియర్ నటుడు సుమన్
  • గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా
  • సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడి
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రానికి 'షో మ్యాన్' అనే పేరు ఖరారు చేశారు. 'మ్యాడ్ మాన్ స్టర్' అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటం గమనార్హం. గతంలో రజినీకాంత్ 'శివాజీ' చిత్రంలో సుమన్ పోషించిన విలన్ పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.

'నూతన్' అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఆర్జీవీతో గతంలో 'ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2' వంటి చిత్రాలు నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

రాంగోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ నిరాడంబరంగా ప్రారంభమైంది. రాబోయే సంక్రాంతి పండుగకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా దర్శకుడు నూతన్ అందిస్తున్నారు.


More Telugu News