అందరి చూపు ‘అఖండ 2’ పైనే.. అక్కడ బాలయ్య చరిత్ర సృష్టిస్తాడా?

  • రేపే ప్రపంచవ్యాప్తంగా ‘అఖండ 2’ గ్రాండ్ రిలీజ్
  • బాలకృష్ణ కెరీర్ లో తొలి పాన్-ఇండియా చిత్రంగా విడుదల
  • హిందీలో బాలయ్యే స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం
  • భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వస్తున్న సినిమా
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా, రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో తొలి పాన్-ఇండియా సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

గతంలో వచ్చిన ‘అఖండ’ మొదటి భాగం కేవలం తెలుగులోనే విడుదలై సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధించడంతో ‘అఖండ 2’ను హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బాలయ్య స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పడం, బాలీవుడ్ నటులను భాగం చేయడం వంటి ప్రత్యేక వ్యూహాలను అనుసరించారు. ముంబైలో ప్రమోషన్స్ నిర్వహించడం, భారీ హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా హిందీ మార్కెట్‌లో మంచి బజ్ క్రియేట్ చేశారు.

సనాతన ధర్మం, శివతత్వం, అఘోరాల నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం ఇటీవల హిందీలో విజయం సాధించిన ‘కాంతార 2’, ‘మహావతార్ నరసింహ’ వంటి చిత్రాల కోవలోకి వస్తుంది. ఈ ఆధ్యాత్మిక అంశాలు ఉత్తరాది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని చిత్రబృందం నమ్ముతోంది.

ఇప్పటివరకు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ వంటి సీనియర్ స్టార్లు పాన్-ఇండియా స్థాయిలో ఆశించిన విజయం సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ‘అఖండ 2’ విజయం బాలకృష్ణకు అత్యంత కీలకం. ఈ సినిమా గనక హిట్టయితే, పాన్-ఇండియా మార్కెట్‌ను జయించిన తొలి సీనియర్ టాలీవుడ్ హీరోగా బాలయ్య సరికొత్త రికార్డు సృష్టిస్తారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


More Telugu News