ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై హఠాన్మరణం

  • ఎల్బీ నగర్ పీఎస్‌లో గుండెపోటుతో ఎస్సై సంజయ్ సావంత్ మృతి
  • పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండటంతో స్టేషన్‌లోనే నిద్ర
  • నిద్రలోనే గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై
  • విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్లడానికి సిద్ధమవుతున్న ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. మృతుడిని ఎస్సై సంజయ్ సావంత్ (58)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే... బుధవారం పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉండటంతో ఎస్సై సంజయ్ మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్‌లోనే నిద్రించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆయనకు ఎన్నికల డ్యూటీ కేటాయించారు. అయితే, బుధవారం ఉదయం విధులకు బయలుదేరాల్సి ఉండగా, నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ప్రాణాలు కోల్పోయారు.

నాచారంలో నివాసముండే సంజయ్ సావంత్ మరణవార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విధి నిర్వహణకు వెళ్లే ముందు అధికారి మృతి చెందడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి సిబ్బంది ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


More Telugu News