రాయ్‌పూర్ వ‌న్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. భారత్‌ బ్యాటింగ్

  • భారత్‌తో రెండో వ‌న్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ దక్షిణాఫ్రికా
  • మూడు మార్పుల‌తో బ‌రిలోకి స‌ఫారీలు.. అదే జ‌ట్టుతో ఆడుతున్న టీమిండియా
  • దక్షిణాఫ్రికా జట్టులోకి బవుమా, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి
రాయ్‌పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. కెప్టెన్ టెంబా బవుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

టాస్ గెలిచిన అనంతరం బవుమా మాట్లాడుతూ.. "పిచ్ పొడిగా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నాం. అప్పుడు బ్యాటింగ్ సులభం అవుతుంది. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం. సిరీస్‌ను సమం చేయడానికి ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్" అని తెలిపాడు. కెప్టెన్ బవుమాతో పాటు కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి తిరిగి జట్టులోకి వచ్చారు. రికెల్టన్, సుబ్రాయెన్, బార్ట్‌మాన్‌లను తుది జట్టు నుంచి తప్పించారు.

మరోవైపు భారత కెప్టెన్ కేఎల్ రాహుల్, గత మ్యాచ్‌లో గెలిపించిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు. "నిజం చెప్పాలంటే, టాస్ విషయంలోనే నాకు ఎక్కువ ఒత్తిడి ఉంది" అని సరదాగా వ్యాఖ్యానించాడు. మంచు ప్రభావంపై తమ బౌలర్లకు అవగాహన ఉందని, దానికి తగ్గ వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు.

జట్ల వివరాలు:

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్‌క్రమ్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో య‌న్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి.


More Telugu News