ఆటోలో మృతదేహాలు.. హైదరాబాద్ పాతబస్తీలో కలకలం

  • ఘటనా స్థలంలో మూడు సిరంజీల లభ్యం   
  • డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానే మరణించారని అనుమానాలు
  • మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించి పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ లోని పాతబస్తీలో కలకలం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం చాంద్రాయణగుట్టలోని ప్లైఓవర్ కింద నిలిపి ఉంచిన ఆటోలో ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించడంతో, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)లుగా గుర్తించారు. 

డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే యువకులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఘటనాస్థలంలో మూడు సిరంజీలను క్లూస్‌ టీమ్‌ గుర్తించింది. దీంతో ముగ్గురు యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోందని, చనిపోయిన యువకులతో కలిసి డ్రగ్స్ తీసుకున్న మూడో వ్యక్తి ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని, యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.  


More Telugu News