తిరుమల కొండపై రీల్స్... ఒడిశా యువకులకు కౌన్సిలింగ్

  • తిరుమల కొండలపై రీల్స్ చేస్తున్న ఐదుగురు యువకులు
  • అటవీ మార్గంలో మాల్వాడి గుండం వద్దకు వెళ్లిన వలస కూలీలు
  • యువకులను గమనించి పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు
  • వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులకు అప్పగించిన ఏవీఎస్వో 
సోషల్ మీడియా రీల్స్ మోజులో కొందరు యువకులు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండలపై అత్యుత్సాహం ప్రదర్శించారు. అటవీ మార్గంలో కొండపైకి చేరుకుని రీల్స్ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వారిని పట్టుకున్నారు.
 
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ముఖేశ్ పీటర్, ములు షికార్, బిశ్వంత్ ప్రసాద్ నౌరి, లింగం ప్రదీప్‌తో పాటు మరో యువకుడు జీవకోన ప్రాంతంలో రోజువారీ కూలి పనులు చేసుకుంటున్నారు. మంగళవారం వీరంతా జీవకోన నుంచి అటవీ మార్గం ద్వారా కపిలతీర్థం కొండపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి మాల్వాడి గుండం వద్దకు వెళ్లి వీడియో రీల్స్ చేయడం ప్రారంభించారు.
 
అదే సమయంలో వారిని అలిపిరి ఏవీఎస్వో రమేష్ కృష్ణ గమనించి, వెంటనే విజిలెన్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది అక్కడికి చేరుకుని ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అలిపిరిలోని ఏవీఎస్వో కార్యాలయానికి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తిరుమల పవిత్రతను, ఇక్కడి నియమ నిబంధనలను వివరించారు.
 
తర్వాత వారిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి చర్యలకు పాల్పడరాదని పోలీసులు వారికి గట్టిగా హెచ్చరించి పంపించి వేశారు.


More Telugu News