నెల్లూరు మేయర్ పై అవిశ్వాసం... 18న ఓటింగ్!

  • నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం
  • టీడీపీకి మద్దతుగా నిలిచిన 42 మంది కార్పొరేటర్లు
  • వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన 40 మందికి పైగా సభ్యులు
నెల్లూరు నగర మేయర్‌ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్‌ 18న అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్‌లోని మెజారిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. అయితే, ఇటీవల రాజకీయ సమీకరణాలు మారడంతో వీరిలో 40 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీకి 42 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. ఈ సంఖ్యా బలంతో, కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు.

ఈ నోటీసులను పరిశీలించిన కలెక్టర్, అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 18న జరిగే ప్రత్యేక సమావేశంలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్‌తో ప్రస్తుత మేయర్ స్రవంతి భవితవ్యం తేలిపోనుంది. అనంతరం కొత్త మేయర్ ఎన్నికకు మార్గం సుగమం కానుంది.


More Telugu News