ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నాం: రేవంత్ రెడ్డి

  • సోనియా, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులను ఖండిస్తూ లేఖ రాస్తామన్న రేవంత్ రెడ్డి
  • నేషనల్ హెరాల్డ్ పేరుతో మనీలాండరింగ్ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
  • కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ ప్రారంభించాలనుకున్నారని వెల్లడి
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారికి తెలంగాణ ప్రజలంతా అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ పార్టీ నేతలపై కేసులు పెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎంతో త్యాగం చేసిందని ఆయన కొనియాడారు.

సాధారణంగా ప్రైవేటు సంస్థల్లో పని చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని, కానీ ఎప్పుడో మూతబడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకోవాలని సోనియా గాంధీ భావించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలనే ఉద్దేశంతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టారని పేర్కొన్నారు. పత్రికను నడిపేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను తీసుకున్నారని అన్నారు.

షేర్ క్యాపిటల్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని, ఇందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి సంబంధించినది లేదని ఆయన అన్నారు. అదే సమయంలో ఎవరు కూడా జేబులో ఒక్క రూపాయి వేసుకోలేదని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ నెహ్రూవేనని ఆయన వ్యాఖ్యానించారు.

వారసత్వంగా ఉన్న పత్రికను నడపాలని సోనియా గాంధీ భావించారని, కానీ మనీలాండరింగ్ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మానసిక ధైర్యం కోల్పోకుండా సోనియా, రాహుల్ గాంధీలు కేసులను ఎదుర్కొన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాన్ని అడ్డుకోవాలని మళ్లీ కేసులు పెట్టారని అన్నారు.

Revanth Reddy
Sonia Gandhi
Rahul Gandhi
Telangana
National Herald case
Narendra Modi

More Telugu News