మరోసారి పరుగుల విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ

  • సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ పోటీల్లో కొనసాగుతున్న అభిషేక్ ఫామ్
  • బరోడాపై 18 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ
  • 20 ఓవర్లలో 222 పరుగులు చేసిన పంజాబ్
  • పునరాగమన మ్యాచ్‌లో తేలిపోయిన హార్దిక్ పాండ్యా
  • బరోడా ముందు 223 పరుగుల భారీ లక్ష్యం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ పరుగుల విధ్వంసం కొనసాగిస్తున్నాడు. బరోడాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. మెరుపు అర్ధశతకం సాధించి అదరగొట్టాడు. అభిషేక్ జోరుకు తోడు, అన్మోల్‌ప్రీత్ సింగ్ (32 బంతుల్లో 69 పరుగులు), నమన్ ధీర్ (28 బంతుల్లో 39 పరుగులు) కూడా రాణించడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

ఇటీవల బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 52 బంతుల్లో 148 పరుగులు చేయడమే కాకుండా, కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు బరోడాపై కూడా అదే ఫామ్ కొనసాగించడంతో టోర్నీలో పంజాబ్ దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని బరోడా ఎలా ఛేదిస్తుందో చూడాలి.

ఈ మ్యాచ్‌తో గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తేలిపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. పంజాబ్ బ్యాటర్లు హార్దిక్ బౌలింగ్‌ను సులభంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు.



More Telugu News