కేరళలో టీవీ రేటింగ్స్ స్కామ్.. రూ. 100 కోట్లు లంచమిచ్చిన టీవీ చానల్!

  • బార్క్ ఉద్యోగికి క్రిప్టో కరెన్సీ రూపంలో లంచం ఇచ్చినట్టు ఆరోపణలు
  • రేటింగ్ మీటర్ల సమాచారాన్ని లీక్ చేసినట్లు మరో చానల్ కథనం
  • ముఖ్యమంత్రికి కేరళ టెలివిజన్ ఫెడరేషన్ ఫిర్యాదు
  • విషయంపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిన బార్క్
కేరళ మీడియా రంగంలో ఓ భారీ కుంభకోణం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఓ స్థానిక టీవీ చానల్ తమ రేటింగ్స్‌ను కృత్రిమంగా పెంచుకునేందుకు ఏకంగా రూ.100 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తాన్ని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఉద్యోగికి క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించినట్లు 'ట్వంటీఫోర్ న్యూస్' అనే మరో చానల్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది.

ఈ కథనం ప్రకారం ప్రేమ్‌నాథ్ అనే బార్క్ ఉద్యోగికి చెందిన 'ట్రస్ట్ వాలెట్' అనే మొబైల్ యాప్‌లోకి, ఆరోపణలు ఎదుర్కొంటున్న చానల్ యాజమాన్యం యూఎస్డీటీ (టెదర్) అనే క్రిప్టో కరెన్సీలో విడతల వారీగా రూ.100 కోట్లు పంపినట్లు తెలిసింది. ఇందుకు ప్రతిగా ప్రేమ్‌నాథ్... ఏయే ప్రాంతాల్లో, ఏయే ఇళ్లలో రేటింగ్ మీటర్లు అమర్చారో పిన్‌కోడ్‌లతో సహా కీలక సమాచారాన్ని ఆ చానల్‌కు వారం ముందుగానే అందించేవాడని 'ట్వంటీఫోర్ న్యూస్' ఆరోపించింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్స్, చెల్లింపుల స్క్రీన్‌షాట్లను కూడా బయటపెట్టింది.

అయితే ఈ ఆరోపణలను సదరు చానల్ ఖండించింది. స్థానిక కేబుల్ ఆపరేటర్ తమ చానల్‌ను 'ల్యాండింగ్ పేజ్'గా (సెట్-టాప్ బాక్స్ ఆన్ చేయగానే వచ్చే చానల్) పెట్టడం వల్లే రేటింగ్స్ పెరిగాయని ఓ ప్రకటనలో తెలిపింది. కానీ, ఆ కేబుల్ ఆపరేటర్‌కు కేవలం 20 వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని, 85 లక్షల కనెక్షన్లు ఉన్న రాష్ట్రంలో ఇంత తక్కువ మంది చూడటం వల్ల రేటింగ్స్ ఎలా పెరుగుతాయని ఇతర చానళ్లు ప్రశ్నిస్తున్నాయి.

ప్రకటనల ఆదాయం కోసం టీవీ చానళ్లు బార్క్ రేటింగ్స్‌పైనే ఆధారపడతాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణంపై కేరళ టెలివిజన్ ఫెడరేషన్ (కేటీఎఫ్) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు బార్క్ కూడా ఈ ఆరోపణలపై ఓ స్వతంత్ర ఏజెన్సీతో ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News