లిక్కర్ కేసులో అరుదైన పరిణామం.. చెవిరెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • ఏపీ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
  • సహ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు
  • ఇది చాలా అరుదైన విషయమని వ్యాఖ్యానించిన హైకోర్టు
  • పిటిషన్ వేసే హక్కుపై న్యాయ పరిశీలన అవసరమన్న న్యాయస్థానం
  • తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవ రెడ్డి (ఏ2), సత్యప్రసాద్ (ఏ3) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై నిన్న ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సహ నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కేసులో ఫిర్యాదుదారులు ఇంప్లీడ్ కావడం చూశామని, కానీ ఒక సహ నిందితుడు మరో నిందితుడి బెయిల్ పిటిషన్‌లో ఇంప్లీడ్ కావడం చాలా అరుదైన విషయమని, ఇది కొత్తగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డికి ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు న్యాయపరమైన హక్కు ఉందో లేదో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా చెవిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బెయిల్ కోరుతున్న నిందితులు అప్రూవర్లుగా మారతామని తమ పిటిషన్‌లో పేర్కొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అంశం తమ క్లయింట్‌కు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నందునే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, చెవిరెడ్డి పిటిషన్‌పై లోతైన పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News