వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య... హైదరాబాదులో ఘటన

  • మద్యం తాగి వేధిస్తున్న భర్తను హత్య చేసిన భార్య
  • కుమారుడు, బంధువుతో కలిసి దారుణానికి పాల్పడిన మహిళ
  • అడ్డుకోబోయిన కూతురిని గదిలో బంధించిన నిందితులు
రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్తను భార్య, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్‌కేసర్‌లో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బోడుప్పల్ దేవేందర్ నగర్‌లో నివసించే బండారు అంజయ్య (55) ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య బుగమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, అంజయ్య ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యాపిల్లలను తీవ్రంగా వేధించేవాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి అంజయ్య తన భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్‌తో కలిసి మద్యం తాగాడు. వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య, కుమారుడు, బంధువు అర్ధరాత్రి సమయంలో అంజయ్య మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అంజయ్య కుమార్తెను ఓ గదిలో బంధించారు.

అనంతరం జరిగిన విషయాన్ని కుమార్తె పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


More Telugu News

Bugamma Hyderabad crime wife kills husband Medipally police station Ghatkesar murder domestic violence Bandaru Anjaiah Booze Telangana news crime news