ఏపీలో రిలయన్స్-జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ రూ.98 వేల కోట్ల పెట్టుబడులు... మంత్రి నారా లోకేశ్ వెల్లడి

  • విశాఖపట్నంలో రిలయన్స్ భారీ పెట్టుబడి
  • రూ.98,000 కోట్లతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ నిర్మాణం
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మంత్రి నారా లోకేశ్
  • భారత్‌కు డేటా క్యాపిటల్‌గా విశాఖ ఎదుగుతోందన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రానున్నది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్, దాని జాయింట్ వెంచర్ అయిన డిజిటల్ కనెక్సియన్ (Digital Connexion) కలిసి విశాఖపట్నంలో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.98,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 1 గిగావాట్ (GW) సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ భారీ పెట్టుబడి రాకతో విశాఖపట్నం "భారత డేటా క్యాపిటల్"‌గా ఎదుగుతోందని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు.

రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన పోస్టుకు #RelianceChoosesAP, #ChooseSpeedChooseAP అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జత చేశారు. ఈ పెట్టుబడి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ముఖ్యంగా విశాఖ టెక్నాలజీ రంగ అభివృద్ధికి కీలకమైన ముందడుగు అని భావిస్తున్నారు. 


More Telugu News