ఇవి నిశ్శబ్ద హంతకులు... గుండెను తీవ్రంగా దెబ్బతీస్తాయి!

  • ప్లాస్టిక్‌లోని ఫ్తాలేట్ రసాయనాలతో గుండె జబ్బుల ప్రమాదం
  • భారత్‌లో ఏటా లక్షకు పైగా గుండె మరణాలకు ఇవే కారణం
  • హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ వాడకం
  • ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని వేడి చేయొద్దని నిపుణుల సూచన
  • ప్లాస్టిక్‌పై కఠిన నియంత్రణ తేవాలని ప్రభుత్వాలకు పిలుపు
మనం రోజూ వాడే ప్లాస్టిక్ వస్తువులలోని ప్రమాదకర రసాయనాలు మన గుండె ఆరోగ్యానికి నిశ్శబ్దంగా ముప్పు తెచ్చిపెడుతున్నాయని ఒక ప్రపంచస్థాయి శాస్త్రీయ అధ్యయనం హెచ్చరించింది. 'ఫ్తాలేట్లు' (Phthalates)గా పిలిచే ఈ రసాయనాలు లక్షలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ఈ రసాయనాల కారణంగా ఒక్క భారతదేశంలోనే ఒక సంవత్సరంలో లక్షకు పైగా గుండె సంబంధిత మరణాలు సంభవించాయని అంచనా వేసింది.

అధ్యయనంలో ఏం తేలింది?: 66 దేశాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం, ప్లాస్టిక్‌ను మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చేందుకు వాడే ఫ్తాలేట్లు మన శరీరంలోకి చేరి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని తేల్చింది. ఈ రసాయనాలు హార్మోన్ల వ్యవస్థను (ఎండోక్రైన్ సిస్టమ్) దెబ్బతీస్తాయి. ఇవి ఆహారం, నీరు, గాలి, సౌందర్య సాధనాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి, రక్తనాళాల్లో వాపు (inflammation) కలిగించి, వాటిని గట్టిగా మారుస్తాయి. దీనివల్ల రక్తనాళాలు సన్నబడి గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదం పెరుగుతోందని పరిశోధకులు వివరించారు. ముఖ్యంగా, 55 నుంచి 64 ఏళ్ల వయసు వారిలో సంభవించే గుండె మరణాలలో 13 శాతం డీఈహెచ్‌పీ (DEHP) అనే ఫ్తాలేట్ రసాయనం వల్లే జరుగుతున్నాయని గుర్తించారు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?: పిల్లలు, గర్భిణులు, వృద్ధులపై ఈ రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. అధిక జనాభా, పారిశ్రామికీకరణ, ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉన్న దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాల్లో ఈ ముప్పు తీవ్రంగా ఉంది.

నిపుణుల సూచనలు: ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రజలు వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా, ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని పెట్టి మైక్రోవేవ్‌లో వేడి చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. సౌందర్య సాధనాలు కొనేటప్పుడు 'ఫ్తాలేట్-ఫ్రీ' అని ఉన్న లేబుల్స్‌ను చూసి ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ వాడకంపై కఠిన నిబంధనలు అమలు చేసి, సురక్షిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని ఈ అధ్యయనం పిలుపునిచ్చింది.


More Telugu News