బాలుగారు అలా అనడాన్ని నేను ఇప్పటికీ మరిచిపోలేదు: గాయకుడు వింజమూరి కృష్ణమూర్తి
- పాటలంటే ఇష్టమన్న కృష్ణమూర్తి
- అవకాశాల కోసం కష్టపడ్డానని వెల్లడి
- ఎక్కడికెళ్లినా బాలూ పేరే వినిపించేదని వ్యాఖ్య
- శైలజ గారితో తొలి పాట పాడానని వివరణ
"మొదటి నుంచి కూడా నాకు పాటలంటే ఇష్టం .. పాడటమంటే ఇష్టం. అందువల్లనే సంగీతం నేర్చుకున్నాను .. మద్రాస్ వెళ్లాను. అక్కడ అవకాశాల కోసం తిరగడం మొదలు పెట్టాను. కొంతమంది సంగీత దర్శకులను కలుసుకున్నాను. అందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం గురించే గొప్పగా చెప్పేవారు. ఆయనతో కాకుండా మరొకరితో పాడించే ఆలోచన లేదని అనేవారు. అయితే అదృష్టం కొద్దీ నా వాయిస్ టెస్ట్ చేయించింది బాలూగారే కావడం విశేషం. అది ఆయన పెద్ద మనసు అనుకోవాలి" అని అన్నారు.
"ఇండస్ట్రీలో పరిస్థితి బాలూగారికి తెలుసును గనుక, ఇక్కడ పోటీ ఎలా ఉంటుందనేది ఆయన చెప్పారు. అందువలన ఇంటికి తిరిగి వెళ్లి జాబ్ చేసుకోమని అన్నారు. ఆయన ఉద్దేశం మంచిదే . కానీ అలా తిరిగి వెళ్లడం నాకు ఇష్టం లేదు. ' గురువు గారూ .. మీరు తింటున్న ప్లేట్ లో నుంచి కొన్ని మెతుకులు క్రిందపడతాయి గదా .. వాటిని ఏరుకుందామని వచ్చాను' అన్నాను నేను. 'నేను మెతుకు క్రింద పడకుండా తింటాను' అన్నారు సరాదాగా ఆయన. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ తరువాత నా మొదటి పాటను శైలజ గారితో కలిసి పాడటం .. అది విని బాలుగారు మెచ్చుకున్నారని ఆమె చెప్పినప్పుడు హ్యాపీగా అనిపించింది" అని చెప్పారు.