ఆల్ టైమ్ గరిష్ఠానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు... ఇన్వెస్టర్లకు కాసుల వర్షం

  • సరికొత్త గరిష్ఠాన్ని తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు
  • రూ. 21 లక్షల కోట్లకు చేరిన కంపెనీ మార్కెట్ విలువ
  • షేరుపై జేపీ మోర్గాన్ 'ఓవర్‌వెయిట్' రేటింగ్
  • ఈ ఏడాదిలో ఇప్పటివరకు 27 శాతం మేర వృద్ధి
భారత స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేరు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశంలోనే అత్యంత విలువైన ఈ కంపెనీ షేరు, ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఆల్ టైమ్ గరిష్ఠ‌ స్థాయిని తాకి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 21 లక్షల కోట్లకు చేరింది.

ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేరు దాదాపు 2 శాతం లాభపడి, ఇంట్రాడేలో రూ. 1559.60 వద్ద జీవిత‌కాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇదే ఈ షేరుకు 52 వారాల గరిష్ఠ‌ ధర కూడా కావడం విశేషం. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ‌ ధర రూ. 1114.85 కాగా, అక్కడి నుంచి సుమారు 40 శాతం మేర వృద్ధి చెందింది.

రిలయన్స్ షేరు తాజా ర్యాలీకి ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ ఇచ్చిన నివేదికే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జేపీ మోర్గాన్ ఈ స్టాక్‌కు 'ఓవర్‌వెయిట్' రేటింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ప్రస్తుత ధర నుంచి 11 శాతం అధికంగా రూ. 1727 టార్గెట్ ధరను అంచనా వేసింది. ఈ సానుకూల నివేదికతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

దీనికితోడు ఇటీవల వెలువడిన రెండో త్రైమాసిక (Q2) ఫలితాల్లో కంపెనీ నికర లాభం 9.6 శాతం పెరగడం కూడా షేరుకు కలిసొచ్చింది. గత కొంతకాలంగా ఈ షేరు నిలకడగా కొన‌సాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 27 శాతం, గత ఐదేళ్లలో 60 శాతానికి పైగా లాభాలను అందించింది.




More Telugu News