'లిక్కర్ రాణి' పేరుతో మా పరువు తీశారు: కవితపై నిరంజన్ రెడ్డి విమర్శలు
- కవిత వల్ల మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయన్న నిరంజన్ రెడ్డి
- ప్రభుత్వ వైఫల్యాలపై కాకుండా తమ నేతలపై విమర్శలు ఎందుకని ప్రశ్న
- ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని కవితకు సవాల్
నిన్న వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల ముందు కవితకు వచ్చిన 'లిక్కర్ రాణి' అనే పేరుతో తాము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలకు సమాధానం చెప్పలేకపోయామని నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కవితకు సభ్యత, సంస్కారం లేవని, తనపై ఆమె చేసిన ఆరోపణలను తన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ప్రజా సమస్యలపై పోరాడకుండా, బీఆర్ఎస్ నాయకులపైనే కవిత విమర్శలు చేయడం ఎవరి మెప్పు కోసమో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సుతిమెత్తగా వ్యవహరిస్తూ.. తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి వంటి నేతలపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. చేతనైతే తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. తాను నియోజకవర్గంలో లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించానని, అందుకే ప్రజలు తనను 'నీళ్ల నిరంజన్ రెడ్డి'గా పిలుచుకుంటారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.