ఇంట్లో విగతజీవిగా కనిపించిన బెంగాల్ సినిమాటోగ్రాఫర్

  • బెంగాలీ సినిమాటోగ్రాఫర్ సౌమ్యదీప్ గుయిన్ ఆత్మహత్య
  • కోల్‌కతాలోని తన నివాసంలో ఉరి వేసుకుని మృతి
  • అవకాశాలు లేక డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు అనుమానం
  • ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌమ్యదీప్ గుయిన్ (40) అనుమానాస్పద స్థితిలో మరణించారు. విక్కీగా అందరికీ సుపరిచితుడైన ఆయన, దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్న స్థితిలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులు గదిలో సౌమ్యదీప్ మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్య అయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. కుటుంబ సభ్యులు కాస్త తేరుకున్నాక, వారిని విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తామని తెలిపారు.

సౌమ్యదీప్ కొంతకాలంగా తాను ఆశించిన స్థాయిలో మంచి ప్రాజెక్టులు రాకపోవడంతో డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. అయితే అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

సౌమ్యదీప్ గుయిన్‌కు దర్శకుడు రాజా చందా, సినిమాటోగ్రాఫర్-దర్శకుడు ప్రేమేంద్ర బికాష్ చాకీ వంటివారితో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. సౌమ్యదీప్ మరణంతో బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.


More Telugu News