ఆర్‌బీఐ అండ.. రికార్డు పతనం నుంచి కోలుకున్న రూపాయి

  • డాలర్‌తో పోలిస్తే 26 పైసలు బలపడి రూ. 89.1450 వద్ద ట్రేడింగ్‌
  • రికార్డు కనిష్ఠ స్థాయి నుంచి రికవరీ
  • రిజర్వ్ బ్యాంక్ జోక్యంతోనే పుంజుకుందన్న నిపుణులు
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఈరోజు లాభాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 26 పైసలు బలపడి 89.1450 వద్ద మొదలైంది. శుక్రవారం నాటి ముగింపు ధర 89.4088తో పోలిస్తే ఇది మెరుగైన ప్రదర్శన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జోక్యం చేసుకోవడం వల్లే రూపాయి విలువలో ఈ సానుకూల మార్పు కనిపించిందని కరెన్సీ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నెల‌ 21న రూపాయి విలువ 89.49 వద్ద చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. భారత ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి, ఆ సమయంలో ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన జోక్యం లేకపోవడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది.

"భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పురోగతి లేకపోవడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి, రూపాయి విలువ 89.60 వద్ద సరికొత్త ఆల్-టైమ్ కనిష్ఠానికి పడిపోయింది" అని విశ్లేషకులు తెలిపారు. ఇటీవల కాలంలో రూపాయి విలువలో తీవ్ర ఒడుదొడుకులను నివారించేందుకు ఆర్‌బీఐ చురుకుగా వ్యవహరిస్తోంది. సమీప భవిష్యత్తులో రూపాయి 89.20-90.00 శ్రేణిలో కదలాడొచ్చని అంచనా.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఇదిలాఉంటే.. సోమవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 122 పాయింట్లు పెరిగి 85,354 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 26,109 వద్ద ట్రేడవుతున్నాయి.


More Telugu News