వారి అనుభవం చాలా ముఖ్యం.. ఆ ఇద్ద‌రూ 2027 వరల్డ్ కప్ ఆడాలి: జాంటీ రోడ్స్

  • 2027 ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడాల‌న్న‌ రోడ్స్‌ 
  • వారి అనుభవం, మానసిక దృఢత్వం జట్టుకు కీలకమ‌ని వ్యాఖ్య‌
  • పరుగులు చేస్తున్నంత కాలం వారిని ఎంపిక చేయాల్సిందేనని సూచ‌న‌
  • సచిన్, ధోనీల విషయంలోనూ ఇలాంటి చర్చ జరిగిందని గుర్తుచేసిన మాజీ క్రికెటర్ 
భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడాలని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరి అపారమైన అనుభవం, మానసిక దృఢత్వం మెగా టోర్నీలో జట్టుకు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఏడాది ఆరంభంలోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారి వన్డే భవిష్యత్తుపై అభిమానులు, క్రీడా విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతోంది.

ఈ విషయంపై జాంటీ రోడ్స్ స్పందిస్తూ.. "సచిన్, ధోనీల విషయంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది వాళ్ల ఇష్టం. పరుగులు చేస్తున్నంత కాలం వారిని కచ్చితంగా ఎంపిక చేయాలి. ప్రపంచకప్ లాంటి టోర్నీలలో ప్రతిభతో పాటు మానసిక స్థైర్యం కూడా చాలా ముఖ్యం. ఆ రెండూ కోహ్లీ, రోహిత్‌లలో పుష్కలంగా ఉన్నాయి" అని అన్నాడు.

గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ చివరి మ్యాచ్‌లో సెంచరీతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, చివరి మ్యాచ్‌లో 74 పరుగులతో అజేయంగా నిలిచి ఫామ్‌లోకి వచ్చాడు. వీరిద్దరూ ఈ నెల‌ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నారు.


More Telugu News