డెడికేషన్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం.. రిజర్వేషన్లపై విధివిధానాలు ఖరారు చేస్తూ రేపు ఉత్తర్వులు

Telangana Cabinet Approves Dedication Commission Report on Reservations
  • మంత్రుల వద్దకే ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్న అధికారులు
  • రేపు జీవో జారీ చేయనున్న పంచాయతీరాజ్ శాఖ
  • జీవోకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఎంపీడీవోలు, ఆర్డీవోలు
రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండేలా కొత్త రిజర్వేషన్లపై నివేదికను డెడికేటెడ్ కమిషన్ నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రుల వద్దకే ఫైలును పంపించి ఆమోదం తెలుపుతూ సంతకాలు తీసుకున్నారు. దీనితో గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు జీవో జారీ చేయనుంది.

పంచాయతీలు, వార్డులలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లపై విధివిధానాలు ఖరారు చేస్తూ శనివారం పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవోకు అనుగుణంగా ఎంపీడీవోలు వార్డులకు, ఆర్డీవోలు సర్పంచి పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు సీట్లు కేటాయిస్తారు. రేపు, ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది.

రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసి, విచారణ ముగించాలని కోరనుంది. హైకోర్టు అంగీకరిస్తే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూలు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది.
Go Back to Shorts
Telangana Government
Telangana
Dedication Commission
Reservations
Panchayat Elections

More Telugu News