పాకిస్థాన్‌లోని కంపెనీలో బాయిలర్ పేలి 15 మంది మృతి

  • ఫైసలాబాద్ జిల్లాలో నేడు ఉదయం ప్రమాదం
  • పరారైన ఫ్యాక్టరీ యజమాని, పోలీసులు అదుపులో మేనేజర్
  • శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని చెబుతున్న అధికారులు
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల ఒక జిగురు తయారీ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనలో దాదాపు 15 మంది కార్మికులు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన లాహోర్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైసలాబాద్ జిల్లాలో ఉదయం సంభవించింది.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరికొంతమంది ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫ్యాక్టరీ యజమాని పరారీ కాగా, మేనేజర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పేలుడు తీవ్రత అధికంగా ఉండటం వల్ల సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ రాజా జహంగీర్ అన్వర్ మీడియాకు వెల్లడించారు. సహాయక బృందాలు ఇప్పటివరకు శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశాయని, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంపై ఫైసలాబాద్ కమిషనర్ నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు.

Pakistan Factory Explosion
Punjab Province
Faisalabad
Boiler Explosion

More Telugu News