రష్మిక మందన్న జీవితంలో ఏం జరుగుతోందో నాకు తెలియదు: దీక్షిత్ శెట్టి

  • రష్మిక ఎంగేజ్‌మెంట్‌పై స్పందించిన నటుడు దీక్షిత్ శెట్టి
  • సహనటుల వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోనని వెల్లడి
  • రష్మికతో సినిమాల గురించే చర్చిస్తానన్న దీక్షిత్
నటి రష్మిక మందన్న, నటుడు దీక్షిత్ శెట్టి కలిసి నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత దీక్షిత్ తన కొత్త చిత్రం ‘బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు రష్మిక ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనిపై దీక్షిత్ స్పందిస్తూ, సహనటుల వ్యక్తిగత విషయాల్లో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.

“సహనటీనటుల వ్యక్తిగత జీవితం గురించి నేను పట్టించుకోను. వారి పర్సనల్ విషయాల గురించి మాట్లాడకపోవడమే వారికి మనం ఇచ్చే గౌరవం. రష్మిక వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆమె ప్రేమ, ఎంగేజ్‌మెంట్‌ గురించి నేనెప్పుడూ చర్చించలేదు. ఎందుకంటే నాకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉండదు. మేమిద్దరం కలిసినప్పుడు కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం” అని దీక్షిత్ శెట్టి వివరించారు.

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా చిత్రీకరణ సమయంలోనే రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీక్షిత్‌కు ఈ ప్రశ్న ఎదురవగా, ఆయన హుందాగా సమాధానమిచ్చారు.


More Telugu News