రైల్‌లో కెటిల్‌తో మ్యాగీ వండిన మహిళ... భద్రతపై తీవ్ర ఆందోళనలు.. వీడియో ఇదిగో!

  • రైలు ఏసీ కోచ్‌లో కెటిల్‌తో మ్యాగీ వండిన మహిళ
  • ఇది తీవ్రమైన భద్రతా ఉల్లంఘన అని నెటిజన్ల ఆందోళన
  • ప్రయాణికులకు కనీస పౌర స్పృహ లేదంటూ విమర్శల వెల్లువ
రైలు ప్రయాణంలో ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తినడం లేదా స్టేషన్లలో దొరికే వేడివేడి పదార్థాలను తీసుకోవడం సాధారణమే. కానీ, ఓ మహిళ ఏకంగా రైలు ఏసీ కోచ్‌లోనే వంట చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ రైలు ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని చార్జింగ్ సాకెట్‌లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి మ్యాగీ వండుకుంది. అంతేకాకుండా, ఆమె ఎంతో సంతోషంగా కెమెరాకు పోజులివ్వడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ వీడియోపై స్పందిస్తూ "ఇది ప్రయాణికులందరి ప్రాణాలకు ముప్పు తేవొచ్చు. ఇలాంటి వారి వల్లే మంచి సౌకర్యాలు అందరికీ దూరమవుతున్నాయి. చాలా మందికి కనీస పౌర స్పృహ లేదు" అని ఓ యూజర్ మండిపడ్డాడు. అయితే, "రైళ్లలో డీసీ విద్యుత్ సరఫరా ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు ఛార్జ్ చేసినప్పుడు లేని ప్రమాదం దీనితో ఎలా వస్తుంది?" అని మరో యూజర్ ప్రశ్నించాడు.

ఈ ఘటనతో ప్రయాణికుల బాధ్యతారాహిత్యంపై మరోసారి చర్చ మొదలైంది. టికెట్ కొన్నంత మాత్రాన రైలులో ఏమైనా చేయవచ్చనే భావన కొందరిలో ఉందని, కెటిల్ వంటి వస్తువులను రైళ్లలోకి ఎలా అనుమతిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

Indian Railways
Woman cooking maggi
Train travel safety
AC coach
Electric kettle
Railway rules
Passenger safety
Viral video

More Telugu News