నిందితుడికి ఉరిశిక్ష... సంచలన తీర్పు వెలువరించిన వికారాబాద్ జిల్లా కోర్టు

  • 2019లో భార్య, ఇద్దరు పిల్లలను హత్యచేసిన ప్రవీణ్
  • నేరం తీవ్రత, ఆధారాలను పరిశీలించి ఉరిశిక్ష విధించిన కోర్టు
  • ఇనుప రాడ్డుతో భార్య, కుమార్తెను చంపి, కుమారుడిని గొంతు నులిమి చంపిన ప్రవీణ్
భార్య, పిల్లల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2019లో వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ కేసు విచారణలో నిందితుడిపై నేరం రుజువైంది. నేరం యొక్క తీవ్రత, ఆధారాలను పరిశీలించిన వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీనివాస్ రెడ్డి నిందితుడికి ఉరిశిక్ష విధించారు.

వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రవీణ్ ఆరేళ్ల క్రితం ఈ హత్యలకు పాల్పడ్డాడు. మొదట భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆమెను, ఐదేళ్ల కుమార్తెను ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడి గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రవీణ్, ఆ తరువాత మనసు మార్చుకుని పోలీసులకు లొంగిపోయాడు.


More Telugu News