తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ఎన్నికల సంఘం

  • ఓటరు జాబితా సవరణకు షెడ్యూలును ప్రకటించిన ఎన్నికల సంఘం
  • ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ
  • జిల్లా పంచాయతీ అధికారులకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది.

ఈ నెల 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ, 21న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది. అదే నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసే అవకాశం ఉంది. సోమవారం మంత్రి మండలిలో స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం ఈ మేరకు దృష్టి సారించాయి.


More Telugu News