భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు కలకలం
  • మిస్సౌరీలో అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం
  • తనిఖీల్లో ఏమీ తేలకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
  • బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమెరికాలో ఓ ప్రయాణికుడు సృష్టించిన కలకలంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. డాలస్ నుంచి షికాగో వెళ్తున్న విమానంలో తన భార్య లగేజీలో బాంబు ఉందని ఓ వ్యక్తి సిబ్బందికి చెప్పడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పైలట్, విమానాన్ని వెంటనే దారి మళ్లించారు.

ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రయాణికుడి హెచ్చరికతో విమానాన్ని మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ లాంబెర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8:40 గంటల సమయంలో సురక్షితంగా దించేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రయాణికులందరినీ కిందకు దించి, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అయితే, తనిఖీల్లో ఎలాంటి బాంబు లభించకపోవడంతో ఇది తప్పుడు బెదిరింపేనని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రోండా హామ్-నీబ్రుగ్గే స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి భయాందోళనలు సృష్టించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనిపై అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది.

ఈ విషయంపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని సెయింట్ లూయిస్‌లో ల్యాండ్ చేశామని, అధికారులు తనిఖీ చేసి క్లియరెన్స్ ఇచ్చాక విమానం తిరిగి బయలుదేరి షికాగోకు సురక్షితంగా చేరుకుందని తెలిపింది.


More Telugu News