సౌదీ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

  • సౌదీ అరేబియాలో భారత యాత్రికుల బస్సుకు ఘోర ప్రమాదం
  • డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో 42 మంది సజీవ దహనం
  • మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన 16 మంది ఉన్నట్లు సమాచారం
  • ఘటనపై స్పందించిన సీఎం రేవంత్.. సహాయక చర్యలకు ఆదేశం 
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారత యాత్రికులు సజీవ దహనమైన విష‌యం తెలిసిందే. ఉమ్రా యాత్ర ముగించుకుని మక్కా నుంచి మదీనాకు వెళుతున్న బస్సు, బదర్-మదీనా మధ్యలోని ముఫరహత్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న యాత్రికులు సజీవ దహనమయ్యారని ఇంగ్లిష్ మీడియా కథనాలు వెల్లడించాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని, కేంద్ర, సౌదీ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

మృతుల్లో హైదరాబాద్‌లోని మల్లేపల్లి బజార్‌ ఘాట్‌కు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఉమ్రా ట్రావెల్స్ ద్వారా యాత్రకు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఈ వార్త తెలియడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


More Telugu News