హైదరాబాద్‌లో విషాదం.. భార్య కేసు పెట్టిందని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

  • హైదరాబాద్ భోలక్‌పూర్‌లో విశాల్ గౌడ్ ఆత్మహత్య
  • టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న విశాల్
  • కొంతకాలంగా దంపతుల మధ్య తీవ్ర విభేదాలు
భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న మనస్తాపంతో హైదరాబాద్ భోలక్‌పూర్‌ కృష్ణానగర్‌ కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కృష్ణానగర్‌కు చెందిన విశాల్‌ గౌడ్ ‌(28) టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి 2023 డిసెంబర్‌లో మల్లాపూర్‌కు చెందిన నవ్య (25)తో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్దలు సర్దిచెప్పినా వారి మధ్య సఖ్యత కుదరలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో పుట్టింటికి వెళ్లిన నవ్య తిరిగి రాలేదు.

రెండు నెలల క్రితం నవ్య తన భర్త విశాల్‌పై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విశాల్‌ను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత కేసు నమోదు కావడంతో మరోసారి స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేశారు. పోలీసుల నుంచి ఫోన్‌ రావడంతో తీవ్ర ఆందోళనకు గురైన విశాల్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమారుడి మృతికి కోడలు నవ్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులే కారణమని విశాల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News