జానపద గాయకురాలి నుంచి ఎమ్మెల్యేగా.. అతిచిన్న వయస్సులో అలీ నగర్ నుంచి గెలిచిన మైథిలీ ఠాకూర్

  • సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపు
  • గెలుపు అలీ నగర్ ప్రజలదేనన్న మైథిలీ ఠాకూర్
  • బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసం ఉంచారన్న మైథిలీ ఠాకూర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ (25) విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఆమె బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు సృష్టించారు. అలీనగర్ నుంచి ఆమె తన సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

తన గెలుపుపై మైథిలీ ఠాకూర్ స్పందిస్తూ, తనకు మాటలు రావడం లేదని అన్నారు. ఈ విజయం ప్రజలదేనని ఆమె పేర్కొన్నారు. అలీనగర్ నియోజకవర్గ ప్రజలు గెలిచినట్లుగా భావిస్తున్నానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ పట్ల ప్రజలు నమ్మకం ఉంచారని ఆమె తెలిపారు.

మైథిలీ ఠాకూర్‌తో పాటు పాతికేళ్ల వయస్సులో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో సోను కుమార్ (గోహ్), నవీన్ కుమార్ (భట్నాహ), కుందన్ కుమార్ (షేక్‌పురా), శంబూబాబు (సుపాల్), రాజ్ కుమార్ సాదా (సిమ్రీ భక్తీయార్‌పూర్) ఉన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నుంచి 30 ఏళ్లు కలిగిన ఎమ్మెల్యేలు నలుగురు, 31-40 ఏళ్లు కలిగిన వారు 32 మంది, 41-50 ఏళ్ల వారు 83 మంది, 51-60 ఏళ్లు కలిగినవారు 65 మంది, 61-70 ఏళ్ల వారు 47 మంది, 71-80 ఏళ్లు కలిగిన వారు 10 మంది ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సగటు వయస్సు 51 సంవత్సరాలుగా ఉంది.

Maithili Thakur
Bihar Assembly Elections
Ali Nagar
Folk Singer
Youngest MLA
RJD

More Telugu News