క్లాస్‌ రూమ్ లో తాలిబన్ రూల్స్.. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ బాగోతం!

  • ఎర్రకోట పేలుళ్ల కేసులో అల్ ఫలా యూనివర్సిటీపై దర్యాప్తు
  • ఘటన తర్వాత వర్సిటీలో భయాందోళనలు.. ఆసుపత్రికి తగ్గిన రోగులు
  • అరెస్ట్ అయిన మరో డాక్టర్ షాహీన్ బాగా చెప్పేవారని విద్యార్థుల వెల్లడి
  • 'డాక్టర్ల టెర్రర్ మాడ్యూల్'పై లోతుగా విచారణ జరుపుతున్న ఏజెన్సీలు
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహమ్మద్, గతంలో తాను పనిచేసిన యూనివర్సిటీలో 'తాలిబన్ తరహా' కఠిన నిబంధనలు అమలు చేసేవాడని విద్యార్థులు వెల్లడించారు. ఈ ఉగ్రకుట్రతో సంబంధమున్న ఇద్దరు డాక్టర్లు పనిచేసిన ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీలో ఇండియా టుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నవంబర్ 10న జరిగిన ఐ20 కారు పేలుడులో ఆత్మాహుతి బాంబర్‌గా ఉన్న డాక్టర్ ఉమర్ మహమ్మద్, మరో నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ సయీద్ గతంలో ఈ యూనివర్సిటీలోనే అధ్యాపకులుగా పనిచేశారు. వారి గురించి ఇండియా టుడే ప్రతినిధులు విద్యార్థులు, సిబ్బందిని రహస్యంగా పలకరించగా కీలక విషయాలు తెలిసాయి.

"ఉమర్ సార్ మాకు పాఠాలు చెప్పేవారు. మా బ్యాచ్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసే కూర్చునేవాళ్ళం. కానీ, ఆయన క్లాసుకు రాగానే మమ్మల్ని వేరువేరుగా కూర్చోబెట్టేవారు" అని ఓ ఎంబీబీఎస్ విద్యార్థి తెలిపారు. ఉమర్ ఎప్పుడూ ఒంటరిగా, ఎవరితో కలవకుండా ఉండేవాడని సిబ్బంది పేర్కొన్నారు. ఆయన క్యాంపస్‌లోని హాస్టల్‌లోనే నివసించేవారని విద్యార్థులు గుర్తుచేసుకున్నారు.

అయితే, ఇదే కేసులో అరెస్టయిన మరో అధ్యాపకురాలు డాక్టర్ షహీన్ సయీద్ మాత్రం చాలా బాగా పాఠాలు చెప్పేవారని విద్యార్థులు గుర్తుచేసుకున్నారు.


More Telugu News