కాళేశ్వరం కమిషన్‌పై విచారణ... జనవరికి వాయిదా

  • కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని పిటిషన్
  • పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎస్ జోషి, స్మితా సబర్వాల్, కేసీఆర్, హరీశ్ రావు
  • ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు
  • ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు 3 వారాల సమయం
కాళేశ్వరం కమిషన్‌ విచారణను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జీఎం మోయినుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు నలుగురు పిటిషనర్లకు మరో మూడు వారాల సమయం ఇచ్చింది. అప్పటి వరకు కేసులో అంతకు ముందు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో జనవరి రెండో వారానికి మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.


More Telugu News