మమ్మల్ని రోబోల్లా చూస్తారు.. మాకు క్షమాపణ ఉండదు: పాక్ పేసర్ హరీస్ రవూఫ్ ఆవేదన

  • ఆటగాళ్లను రోబోల్లా చూస్తున్నారన్న పాక్ పేసర్ హరీస్ రవూఫ్
  • తమకు క్షమాపణ ఉండదంటూ విమర్శలపై ఆవేదన
  • ఆసియా కప్ ఫైనల్‌లో పేలవ ప్రదర్శనపై తొలిసారి స్పందన
  • తాము కూడా మనుషులమే, చెడ్డ రోజులు ఉంటాయన్న హరీస్
  • శ్రీలంకపై 4 వికెట్లతో పాక్‌ను గెలిపించిన రవూఫ్
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ తనపై వస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లను మనుషుల్లా కాకుండా రోబోల్లా చూస్తారని, ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని ఆశిస్తారని, కానీ తమకు క్షమాపణ అనేది ఉండదని వాపోయాడు. శ్రీలంకతో నిన్న‌ జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్‌కు 6 పరుగుల స్వల్ప తేడాతో విజయాన్ని అందించిన అనంతరం అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేయడంపై అడిగిన ప్రశ్నకు హరీస్ బదులిచ్చాడు. "మాకు ఎలాంటి క్షమాపణ ఉండదు. మేం రోబోల్లా ఆడాలని అందరూ ఆశిస్తారు. కానీ, మేం కూడా మనుషులమే. మాకూ కొన్నిసార్లు చెడ్డ రోజులు ఉంటాయి" అని అన్నాడు. ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌పై హరీస్ రవూఫ్ 3.4 ఓవర్లలోనే 50 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

"ఒక ఆటగాడిగా ప్రణాళికలు అనుకున్నట్లు జరగనప్పుడు చెడ్డ రోజు ఎదురవుతుంది. అంతమాత్రాన కుంగిపోకూడదు. మా నైపుణ్యాలపై నమ్మకం ఉంచి, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. ఏ బౌలర్‌కైనా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు" అని హరీస్ వివరించాడు. 

అభిమానుల నిరాశ గురించి మాట్లాడుతూ, తాము చెత్తగా ఆడిన రోజున కూడా వంద శాతం ప్రయత్నించలేదని ఎప్పుడూ అనుమానించవద్దని కోరాడు. "పది మంచి మ్యాచ్‌లు ఆడి, ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే.. అందరూ ఆ ఒక్క చెడ్డ మ్యాచ్‌నే గుర్తుపెట్టుకుంటారు. విమర్శలను ఏ ఆటగాడూ ఇష్టపడడు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదే సమయంలో పాకిస్థాన్ తరఫున టెస్టు క్రికెట్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హరీస్ రవూఫ్ స్పష్టం చేశాడు. "సెలెక్టర్లు లేదా బోర్డు నన్ను టెస్టులకు ఎంపిక చేస్తే ఆడటానికి నేను సిద్ధం. అయితే, రెడ్-బాల్ క్రికెట్‌కు సిద్ధమవ్వడానికి తగిన సమయం ఇవ్వాలి. ముందుగానే సమాచారం ఇస్తే అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవుతాను" అని తెలిపాడు. కాగా, ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో హరీస్ రవూఫ్ రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైన విషయం విదితమే.



More Telugu News