భారత్‌తో ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం: ట్రంప్ కీలక ప్రకటన

  • భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నామన్న ట్రంప్
  • గత ఒప్పందాల కంటే ఇది భిన్నమైందని, న్యాయబద్ధంగా ఉంటుందని వెల్లడి
  • ప్రధాని మోదీతో తనకు అద్భుతమైన సంబంధాలున్నాయని వ్యాఖ్య
  • ఇండో-పసిఫిక్‌లో భారత్ కీలక వ్యూహాత్మక భాగస్వామి అని కొనియాడిన ట్రంప్
  • రాయబారి నియామకంతో ఇరు దేశాల బంధం మరింత బలపడుతుందని ఆశాభావం
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరలో ఉన్నామని ఆయన వెల్లడించారు. గతంలో జరిగిన ఒప్పందాలకు ఇది పూర్తిగా భిన్నంగా, ఇరు పక్షాలకు న్యాయం చేకూర్చేలా ఉంటుందని స్పష్టం చేశారు. అందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంటోందని ట్రంప్ తెలిపారు.

భారత్‌కు అమెరికా నూతన రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్, ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. గోర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ 
హాజరయ్యారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు అద్భుతమైన సంబంధాలున్నాయని అన్నారు. అమెరికాకు ఉన్న అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధం ఒకటని ఆయన అభివర్ణించారు. "ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటైన భారత్ అద్భుతమైన దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మాకు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతా భాగస్వామి. సెర్గియో నియామకంతో ఈ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని నేను విశ్వసిస్తున్నాను" అని ట్రంప్ పేర్కొన్నారు.

అక్టోబర్‌లో సెనేట్ ఆమోదం పొందిన 38 ఏళ్ల సెర్గియో గోర్, భారత్‌కు అత్యంత పిన్న వయస్కుడైన అమెరికా రాయబారిగా రికార్డు సృష్టించారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఈయన, గతంలో వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా గోర్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించినందుకు అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మాట్లాడుతూ.. "అధ్యక్షుడు, నేను ఇద్దరం భారత్‌ను ప్రేమిస్తాం" అని వ్యాఖ్యానించారు.


More Telugu News