మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్

  • మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల బాధ్యతల స్వీకరణ
  • కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి రాక
  • ముస్లిం మత పెద్దల ప్రార్థనల అనంతరం ఛాంబర్‌లో బాధ్యతల స్వీకారం
టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఈరోజు తన శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో, ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా అధికారికంగా విధుల్లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌కు పలువురు అధికారులు, నేతలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

గత నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అనంతరం నవంబర్ 4వ తేదీన అజారుద్దీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను అప్పగించారు. తాజాగా ఆయన ఈ శాఖల బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. 


More Telugu News