సీఎం చంద్రబాబు ఆదేశాల ఎఫెక్ట్.. బెంగళూరులో డ్రగ్స్ డాన్ మడ్డి అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మడ్డి
- సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
- విచారణ నిమిత్తం ఎపీకి నిందితుడి తరలింపు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన మధుసూదన్ రెడ్డి, బెంగళూరు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచిన పోలీసులు, పక్కా సమాచారంతో బెంగళూరులో అతడిని పట్టుకున్నారు.
గత సెప్టెంబర్ నెలలో బెంగళూరు నుంచి విశాఖపట్నంకు డ్రగ్స్ తరలిస్తున్న శ్రీవాత్సవ్, హవి అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో మడ్డి పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో కీలక పురోగతి లభించినట్లయింది.
ప్రస్తుతం మడ్డిని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నారు. అతడిని విచారిస్తే డ్రగ్స్ నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు, సూత్రధారుల వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతాయని పోలీసు వర్గాలు తెలిపాయి.