భారత ఏజెన్సీలకు భారీ విజయం... విదేశాల్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్

  • జార్జియాలో వెంకటేశ్ గార్గ్, అమెరికాలో భాను రాణా పట్టివేత
  • హర్యానా పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టిన భారత ఏజెన్సీలు
  • బీఎస్పీ నేత హత్య కేసులో వెంకటేశ్ గార్గ్ ప్రధాన నిందితుడు
  • లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో భాను రాణాకు సంబంధాలు
  • త్వరలోనే ఇద్దరినీ భారత్‌కు అప్పగించనున్న అధికారులు
విదేశాల్లో తలదాచుకుంటూ, భారత్‌లో నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను భారత భద్రతా ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి. హర్యానా పోలీసులతో కలిసి చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో వెంకటేశ్ గార్గ్‌ను జార్జియాలో, భాను రాణాను అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే వీరిద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

హర్యానాలోని నారాయణ్‌గఢ్‌కు చెందిన వెంకటేశ్ గార్గ్‌పై భారత్‌లో 10కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. గురుగ్రామ్‌లో ఓ బీఎస్పీ నేత హత్య కేసులో ప్రమేయం ఉన్న తర్వాత అతడు జార్జియాకు పారిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల యువతను తన గ్యాంగ్‌లో చేర్చుకుని నేర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. విదేశాల్లోనే ఉంటున్న మరో గ్యాంగ్‌స్టర్ కపిల్ సాంగ్వాన్‌తో కలిసి గార్గ్ ఓ దోపిడీ ముఠాను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇక, అమెరికాలో పట్టుబడిన భాను రాణాకు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలున్నాయి. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రాణా.. చాలా కాలంగా అమెరికాలో ఉంటూ హర్యానా, పంజాబ్, ఢిల్లీలో తన నెట్‌వర్క్‌ను విస్తరించాడు. పంజాబ్‌లో జరిగిన ఓ గ్రెనేడ్ దాడి కేసు విచారణలో ఇతని పేరు బయటకు వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో కర్నాల్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా, వారు భాను రాణా ఆదేశాలతోనే హ్యాండ్ గ్రెనేడ్లు, తుపాకులు కలిగి ఉన్నట్లు తేలింది.

ప్రస్తుతం భారత్‌కు చెందిన రెండు డజన్లకు పైగా ప్రధాన గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో ఉంటూ, ఇక్కడ యువతను నియమించుకుని నేరాలకు పాల్పడుతున్నారని ఏజెన్సీలు చెబుతున్నాయి. తాజా అరెస్టులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.


More Telugu News