బీహార్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

  • పాట్నాలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన నారా లోకేశ్
  • గత పదేళ్లలో దేశం అనూహ్యంగా అభివృద్ధి సాధించిందని ప్రశంస 
  • నితీశ్ కుమార్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని వ్యాఖ్య 
  • రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం పురోగమిస్తుందని వ్యాఖ్య
  • ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుతో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి 
రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలు సరైన సమయంలో సరైన నేతను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఫలితంగా గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందని ప్రశంసించారు.

సమర్థవంతమైన నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో బీహార్ గణనీయంగా అభివృద్ధి చెందిందని, ‘నితీశ్‌కు ముందు, నితీశ్ తర్వాత’ అనే విధంగా రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సమర్థుడైన నాయకుడు ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో బీహార్ ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘డబుల్ ఇంజన్ బులెట్ సర్కారు’ కారణంగా అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని లోకేశ్ వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశ, రాష్ట్రాల పురోభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు ఎంతో అవసరమని, ఈ విషయాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించినట్లు ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


More Telugu News