హాంకాంగ్ సిక్సెస్-2025 క్రికెట్.. డీఎల్ఎస్ విధానంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం

  • నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసిన భారత్
  • 3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసిన పాకిస్థాన్
  • వర్షం అంతరాయం కలిగించడతో డీఎల్ఎస్ పద్ధతిలో విజేత నిర్ణయం
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన పాకిస్థాన్ 3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. డక్‌వర్త్ లూయిస్ విధానం (డీఎల్ఎస్) ప్రకారం భారత జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత జట్టులో రాబిన్ ఊతప్ప 11 బంతుల్లో 28 పరుగులు, భరత్ చిప్లి 13 బంతుల్లో 24 పరుగులు చేసి రాణించారు. దినేశ్ కార్తీక్ 6 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ 1 వికెట్ తీసుకున్నారు.

87 పరుగుల లక్ష్యంతో పాకిస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. మూడు ఓవర్లు ముగిసే సమయానికి వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి ఆటను కొనసాగించే వీలు లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ విధానం ద్వారా విజేతను నిర్ణయించారు. భారత బౌలర్లలో స్టువార్ట్ బిన్నీ ఒక వికెట్ తీశాడు.


More Telugu News