మా అమ్మకు మీరే హీరో.. ప్రధాని మోదీతో తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి

  • ప్రపంచకప్ విజేత మహిళల జట్టుతో ప్రధాని మోదీ భేటీ
  • ఈ సందర్భంగా ప్రధానితో మాట్లాడిన పేసర్ అరుంధతి రెడ్డి
  • తన తల్లికి మోదీ హీరో అని చెప్పిన అరుంధతి
  • మీరు తన హీరో అని మా అమ్మ చెప్పమన్నారన్న తెలుగు క్రికెటర్
  • మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానని తల్లి నాలుగైదు సార్లు ఫోన్ చేసిందని వెల్లడి
భారత మహిళల క్రికెట్ జట్టు పేసర్ అరుంధతి రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు బుధవారం ప్రధాని నివాసంలో ఆయన్ను కలిసింది. ఈ సందర్భంగా అరుంధతి రెడ్డి తన తల్లి పంపిన ఓ ప్రత్యేక సందేశాన్ని ప్రధానికి తెలియజేసింది.

ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం రావడంతో అరుంధతి ప్రధానితో, "మీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. మా అమ్మ మీకు పంపిన ఒక సందేశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆమెకు మీరు హీరో అట" అని తెలిపింది. అరుంధతి మాటలకు ప్రధాని మోదీ చిరునవ్వుతో స్పందించారు.

అంతేగాక‌ తన తల్లి ఈ విషయం చెప్పడానికే తనకు నాలుగైదు సార్లు ఫోన్ చేసిందని అరుంధతి వివరించింది. "మా అమ్మ నాకు 4-5 సార్లు ఫోన్ చేసి, 'నా హీరోని నువ్వు ఎప్పుడు కలుస్తున్నావు?' అని పదేపదే అడిగింది" అని ఆమె చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వారు. 28 ఏళ్ల అరుంధతి రెడ్డి.. ఇటీవల ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలు. 


More Telugu News