టిప్పర్ అతి వేగం వల్లే: చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ప్రకటన

  • ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందడం పట్ల ఆర్టీసీ దిగ్భ్రాంతి
  • రోడ్డు మలుపుగా ఉండటంతో పాటు, టిప్పర్ అతి వేగంతో ఉందని వెల్లడి
  • టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడి
  • కంకర ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక మృతి చెందారని వెల్లడి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది. టిప్పర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆర్టీసీ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రోడ్డు మలుపు వద్ద టిప్పర్ అతి వేగంగా ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపింది.

ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గానీ, బస్సు డ్రైవర్ గానీ కారణం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని, డ్రైవర్ సర్వీసు రికార్డులో గతంలో ఎలాంటి ప్రమాదాలు లేవని వెల్లడించింది. టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పేర్కొంది. టిప్పర్ బలంగా ఢీకొనడంతో బస్సు ముందు భాగంతో పాటు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది.

ఢీకొట్టిన టిప్పర్ బస్సు వైపు ఒరిగిపోవడంతో, అందులోని కంకర ప్రయాణికులపై పడి ఊపిరాడక మృతి చెందారని వెల్లడించింది. విషయం తెలియగానే ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారని తెలిపింది.

Telangana RTC
Chevella bus accident
Telangana bus accident
Road accident
Bus accident
Tipper truck

More Telugu News