టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం.. ఘటనపై విచారణకు ఆదేశం: పొన్నం ప్రభాకర్

  • క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ
  • బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు వెల్లడి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆయన రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలిపారు.
  
రహదారిపై ఉన్న ఓ గుంతను తప్పించే ప్రయత్నంలో టిప్పర్ లారీ అదుపుతప్పి రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో హృదయ విదారక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. 


More Telugu News